సూర్యాపేట బ్యూరో, మే 30 శుభోదయ డైనమిక్ వార్త
వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే వరి కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగలబెట్టవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన పాల్గొన్నారు.
భూమి సారానికి ముప్పు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. భూమి సాంద్రత పెరగడంతో అధిక ఎరువులు వాడాల్సి వచ్చి రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు.
కాలుష్యం, ప్రమాదాలకు కారణం
వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. మంటలు వ్యాపించి సమీపంలోని చెట్లు, వ్యవసాయ పరికరాలు, ఇతర విలువైన ఆస్తులు దగ్ధమయ్యే ప్రమాదం ఉందన్నారు.
కేసులు నమోదు చేస్తాం: ఎస్పీ
జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ వరి కొయ్యల దహనం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని, భూముల సారాన్ని తగ్గిస్తుందని అన్నారు. కొయ్యలను కాల్చడం వల్ల ప్రమాదాలు సంభవిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అవగాహన కార్యక్రమాలు కొనసాగింపు
రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఏసీపీ ప్రసన్న కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఏడీఏ జ్ఞానేశ్వరి, ఏఓ కృష్ణ సందీప్, సర్పంచ్ బూపాల్ రెడ్డి, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.


