సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, ఏప్రిల్ 26
సూర్యాపేట జిల్లాలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను నేటి నుండి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన సూచించారు.ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరణ ఇచ్చారు.
మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం
ఏప్రిల్ 26 నుంచి మే 10, 2026 వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు వంటి అంశాలను సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు.దేశంలో మొదటిసారిగా స్వీయ గణన విధానాన్ని ప్రవేశపెట్టడం డిజిటల్ భారత్ దిశగా కీలక అడుగని పేర్కొన్నారు.
స్వీయ గణన ముఖ్యాంశాలు
కుటుంబాలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం
మొబైల్ నంబర్, OTP ద్వారా సురక్షిత లాగిన్ విధానం
రాష్ట్రం, జిల్లా, గ్రామం/పట్టణం ఎంపిక చేసి డిజిటల్ మ్యాప్లో నివాస స్థలం గుర్తింపు
సులభమైన ప్రశ్నలు, సహాయం కోసం FAQs మరియు టూల్ టిప్స్ అందుబాటు
నమోదు పూర్తయిన తర్వాత ప్రత్యేకమైన SE ID SMS/ఈమెయిల్ ద్వారా అందజేత
ఎన్యూమరేటర్ పాత్ర కీలకం
స్వీయ గణన చేసినప్పటికీ ఎన్యూమరేటర్ గృహ సందర్శన తప్పనిసరిగా జరుగుతుందని తెలిపారు. వారు SE ID సేకరించి వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసి ఫైనల్గా సమర్పిస్తారు. HLO యాప్ ద్వారా డేటా ధృవీకరణ జరుగుతుంది. స్వీయ గణన చేయని కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్ స్వయంగా నమోదు చేస్తారు.
ప్రజలు పాటించాల్సిన సూచనలు
ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశంలోనే వివరాలు నమోదు చేయాలి
లొకేషన్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయాలి
ఒక మొబైల్ నంబర్తో ఒకే కుటుంబం నమోదు చేయాలి
ఫైనల్ సబ్మిట్కు ముందు వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి
తప్పు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి
SE ID భద్రపరచుకోవాలి
పోర్టల్లో OTP ధృవీకరణ అనంతరం కుటుంబ వివరాలు నమోదు చేసి సమర్పించిన తర్వాత లభించే SE IDను భద్రపరచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి కుటుంబం పాల్గొనాలి
ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేయడం ద్వారా ఖచ్చితమైన జనగణన సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా స్వీయ గణనలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ఎస్ ఓ ఇస్లావత్ ఓబులాలు, ఎస్ ఓ వి రామారావు, ఎం. రాజేష్, దున్న శ్యామ్ తదితరులు మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


