నేరేడుచర్ల, ఏప్రిల్ 26,శుభోదయ డైనమిక్ వార్త
భారత జనగణన–2027లో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను ప్రారంభించినట్లు ఆదివారం నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అవకాశం
స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ప్రజలు ఆన్లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దీంతో గణన ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఆన్లైన్ ద్వారా సులభ నమోదు
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్రజలు సులభంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో ఒకే మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. OTP ద్వారా ధృవీకరణ అనంతరం భాషను ఎంపిక చేసుకుని వివరాలు నమోదు చేయవచ్చు.
33 ప్రశ్నలకు సమాధానాలతో పూర్తి నమోదు
ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నమోదు చేసిన వివరాలను Preview ద్వారా పరిశీలించి Submit చేయాలి.
SE ID భద్రపరచడం కీలకం
నమోదు పూర్తైన తర్వాత H అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID జనరేట్ అవుతుంది. ఈ IDని స్క్రీన్షాట్ తీసుకోవడం లేదా నోట్ చేసుకుని భద్రపరచాలని అధికారులు సూచించారు.
గణన అధికారికి SE ID చూపాలి
మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE ID చూపిస్తే, నమోదు చేసిన వివరాలను వారు ధృవీకరిస్తారు. దీంతో గణన ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుంది.
ప్రజల భాగస్వామ్యమే విజయానికి పునాది
“మన బాధ్యత – మన సమాచారం” అనే నినాదంతో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
