డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 26
మోతే మండలంలోని రాఘవపురం ఎక్స్ రోడ్ నుండి సిరికొండకు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో ఇరుకుగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డు పక్కనే బైకులు నిలిపివేయడం, చిన్నచిన్న గుడిసెలు ఏర్పడడంతో రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోయింది.
దారి ఇరుకుగా మారిన పరిస్థితి
సాధారణంగా సుమారు 50 మీటర్ల వెడల్పు ఉండాల్సిన రహదారి ప్రస్తుతం 10 మీటర్లకూ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా రావడానికే కష్టంగా మారింది.
విద్యార్థుల రవాణాకు ఆటంకం
ఈ మార్గంలో స్కూల్ బస్సులు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. రోడ్డుపై బైకులు అడ్డంగా నిలిపివేయడంతో బస్సు డ్రైవర్లు హారన్ కొట్టినా స్పందించకపోవడం, కొన్ని సందర్భాల్లో వాగ్వాదాలు, దాడుల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి ఆక్రమణలను తొలగించి, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని గ్రామ ప్రజలు, వాహనదారులు గ్రామ సెక్రటరీ సహా సంబంధిత అధికారులను కోరుతున్నారు.
