సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 20
సూర్యాపేట జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ 2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు కీలకమని పేర్కొన్నారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం
జిల్లాలో జనాభా గణన–2027ను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి సెక్షన్ క్లార్క్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు మార్చి 20, 22, 23 తేదీలలో మూడు రోజుల పాటు ఇళ్ల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ కార్యక్రమాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు.
రెండు దశల్లో జనాభా గణన
జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు.
మొదటి దశ: ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్) మరియు గృహ గణన మే 11 నుంచి జూన్ 9, 2026 వరకు
రెండో దశ: జనాభా గణన 2027 ఫిబ్రవరిలో
మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు.
డిజిటల్ విధానంలో తొలి జనాభా గణన
ఈసారి దేశంలో తొలిసారిగా జనాభా గణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపడతారని, ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.
34 అంశాలపై వివరాల సేకరణ
మొదటి దశలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి మొత్తం 34 ప్రశ్నలపై వివరాలు సేకరిస్తారు. ఇందులోఇంటి నిర్మాణం, కుటుంబ యజమాని వివరాలు, తాగునీరు, మురుగు పారుదల, మరుగుదొడ్లు, వంటగది వంటి సౌకర్యాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాల వివరాలు నమోదు చేస్తారు.
అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, సీపీఓ కిషన్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జనాభా గణాంక అధికారి రవీంద్ర నాయక్ మండలాల వారీగా గణన బ్లాకుల విభజన, గణన విధానంపై శిక్షణ ఇచ్చారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వి. రామారావు, ఉప గణాంక అధికారి ఎం. రాజేష్, బి. కోటేశ్వరరావు, పర్యవేక్షకులు దున్న శ్యామ్, మండల ప్రణాళికా గణాంక అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
