డైనమిక్ న్యూస్, మార్చి 15, నేరేడు చర్ల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పురపాలక సంఘ చైర్మన్ కొణతం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శానిటేషన్ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని వైద్యులు సూచించారు.
ప్రజా సేవలో శానిటేషన్ సిబ్బంది పాత్ర కీలకం
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం అవసరమని అన్నారు.
పలువురు ప్రజాప్రతినిధులు హాజరు
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, బస్తీ దవాఖానా వైద్యుడు డాక్టర్ జె. సాయి రాం, 9వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 12వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలీం మహమ్మద్, 13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ళ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే ఏ యన్ ఎం లు, ఆశా వర్కర్లు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


