సూర్యాపేట బ్యూరో, మార్చి 13 ,డైనమిక్ న్యూస్
వంట నూనె కల్తీకి సంబంధించిన ఫిర్యాదు నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రభాకర్ శుక్రవారం పోలీసులతో కలిసి స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన వంట నూనె వాహనాలను పరిశీలించారు.
ఫిర్యాదుపై వెంటనే స్పందన
స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఆహార కల్తీ ఆరోపణలపై వెంటనే స్పందించిన అధికారులు కోదాడ టౌన్ పోలీసులతో కలిసి వంట నూనెను రవాణా చేస్తున్న ట్యాంకర్ మరియు ఆటో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రైస్ బ్రాన్ రిఫైన్డ్ ఆయిల్గా గుర్తింపు
తనిఖీ సమయంలో డ్రైవర్ వద్ద ఉన్న ఇన్వాయిస్ బిల్ ఆధారంగా ట్యాంకర్లో ఉన్నది స్వీట్ ఆయిల్ కాకుండా రైస్ బ్రాన్ రిఫైన్డ్ ఆయిల్ అని అధికారులు గుర్తించారు. ట్యాంకర్లోని నూనెను టిన్ డబ్బాలలో నింపి ఆటో వాహనంలో నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నూనెను కోదాడ పట్టణంలో ఎవరికి సరఫరా చేయాల్సి ఉందో ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.
లైసెన్స్, భద్రతా లోపాలు గుర్తింపు
పరిశీలనలో ట్యాంకర్ వాహనానికి FSSAI లైసెన్స్ ఉన్నప్పటికీ, ఆటో వాహనానికి సంబంధిత లైసెన్స్ లేకపోవడం బయటపడింది. అలాగే ట్యాంకర్లో నూనె రవాణా సమయంలో దొంగతనం లేదా కల్తీని నివారించేందుకు అవసరమైన లాకింగ్ లేదా సీలింగ్ విధానం లేకపోవడం కూడా అధికారులు గుర్తించారు.
ల్యాబ్ పరీక్షలకు నమూనాలు పంపింపు
ట్యాంకర్ మరియు ఆటో వాహనాల్లోని వంట నూనె నుంచి నమూనాలను సేకరించి హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో నూనె కల్తీగా తేలితే సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రజలకు ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనలు
జిల్లాలో ఎక్కడైనా ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుందనే అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని జోనల్ ఫుడ్ కంట్రోలర్ ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లా పరిధిలో ఆహార కల్తీ ఫిర్యాదుల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రభాకర్ (మొబైల్: 91332 91926) ను సంప్రదించాలని సూచించారు.
