సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,మార్చి 13
సూర్యాపేట పట్టణంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయాలకు సిద్ధం చేసిన 41 గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
నమ్మదగిన సమాచారంతో తనిఖీలు
నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి పట్టణంలోని పీఎస్ఆర్ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఒక షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లు గుర్తించారు.
గృహ, వాణిజ్య సిలిండర్లు గుర్తింపు
సీజ్ చేసిన సిలిండర్లలో 21 గృహ వినియోగానికి చెందినవి కాగా, 20 వాణిజ్య వినియోగానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. వీటిని అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అక్రమ వ్యాపారాలపై హెచ్చరిక
ప్రజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, గృహ సిలిండర్లను వాణిజ్యపరంగా విక్రయించడం చట్టవిరుద్ధమని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్యాస్ సరఫరా పై నిఘా
గ్యాస్ నిల్వలు, ధరలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా చర్యలు తప్పవని తెలిపారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై పోలీస్ శాఖ నిఘా ఉంచిందని చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు
జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరవద్దని సూచించారు.

ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలి
గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వ్యక్తులు గ్యాస్ బుకింగ్ చేస్తే గుర్తించాలని ఎస్పీ సూచించారు. వినియోగదారులకు నిబంధనల ప్రకారం సకాలంలో గ్యాస్ సిలిండర్లను అందించాలని కోరారు.
