సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా యువజన & క్రీడాశాఖ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఘన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చిన నాయకుడు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమన్నారు.
నిష్పాక్షికత, క్రమశిక్షణకు ప్రతీక
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి విశిష్ట సేవలందించిన శ్రీపాదరావు సభా కార్యక్రమాలను నిష్పాక్షికత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో సమర్థవంతంగా నిర్వహించారని కలెక్టర్ గుర్తుచేశారు. గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమని అన్నారు. సరళత, సమగ్రత, నిబద్ధత ఆయన వ్యక్తిత్వ లక్షణాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన అంకితభావం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, డీవైఎస్ఓ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్వో వెంకటరమణ, డీఎంఓ నాగేశ్వర శర్మతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

