నేరేడుచర్ల, మార్చి 1, డైనమిక్ న్యూస్
రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన తేదీలను ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నిధులు జమ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
క్యాబినెట్ సమావేశంపై అసంతృప్తి
ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, పట్టణ అధ్యక్షుడు పరికె భరత్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందనే ఆశ రైతుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
నవంబర్ నిధులు ఇంకా బకాయి
నవంబర్లో జమ కావాల్సిన రైతు భరోసా నిధులు మార్చి నెల వచ్చినా రైతుల ఖాతాల్లో జమ కాలేదని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.
సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ధనుంజయ నాయుడు ఆరోపించారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం లక్ష్య సాధనలో విఫలమైందని, అర్హులందరికీ ప్రయోజనం అందడం లేదన్నారు. అలాగే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శించారు.
మహిళలు, బీసీల హామీలపై దృష్టి పెట్టాలి
మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం, బాలికలకు స్కూటీల పథకం, చేయూత పెన్షన్ రెట్టింపు వంటి హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. బీసీలకు ఇచ్చిన 21 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
