సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 24
సూర్యాపేట జిల్లాలో నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
25 ఫిబ్రవరి నుంచి 18 మార్చి వరకు నిషేధాజ్ఞలు
జిల్లాలో 25-02-2026 నుంచి 18-03-2026 వరకు పరీక్షలు జరుగుతుండగా, ఈ కాలంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
అమల్లో ఉండే ముఖ్య నిబంధనలు
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదు.
నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద సంచరించడం నిషేధం.
పరీక్షా కేంద్రాల 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు 25-02-2026 నుంచి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మూసివేయాలి.
విద్యార్థులకు సూచనలు
విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
