సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 17
జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోషణ స్థితిపై క్రమానుసార పర్యవేక్షణ
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ‘పోషణ ట్రాకర్’ ద్వారా సేవలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
నూతన ప్రీ-స్కూల్ సిలబస్ అమలు
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నూతన ప్రీ-స్కూల్ సిలబస్ ప్రకారం బోధన జరగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రాలను సమయానికి ప్రారంభించి, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని సూచించారు.
మౌలిక సదుపాయాల మెరుగుదల
అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మహిళలు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారం
వయోవృద్ధుల మెయింటెనెన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలపై అకృత్యాలు జరగకుండా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా శిశు సంరక్షణ, మహిళా సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమంపై చేపట్టాల్సిన చర్యలను సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కే. నరసింహరావు, సూపరింటెండెంట్ జి. హుస్సేన్, డిసిపివో రవి కుమార్, ఎఫ్.ఆర్.వో బి. వినోద్ కుమార్, సంకల్ప జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
