నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 15
మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం మరియు ఛాయా సోమేశ్వరాలయం దేవాలయాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకుల చేతుల మీదుగా అభిషేకాలు, అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
చారిత్రాత్మక కట్టడాల అభివృద్ధికి కట్టుబాటు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. 11-12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుందని తెలిపారు. పానగల్ దేవాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
యునెస్కో గుర్తింపునకు కేంద్రం చర్యలు తీసుకోవాలి
ఈ చారిత్రాత్మక దేవాలయాలకు యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఇటువంటి వారసత్వ కట్టడాలను ప్రపంచ పటంలో నిలబెట్టడం మనందరి బాధ్యత అని అన్నారు.
ఛాయా సోమేశ్వరాలయంలో అద్భుతం
ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎల్లప్పుడూ ఒకే విధంగా నీడ నిలకడగా ఉండడం ప్రత్యేకతగా మంత్రి ప్రస్తావించారు. ఇది ఆలయ నిర్మాణ శైలిలోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు.
మహాశివరాత్రి సందర్భంగా ప్రజల గిఫ్ట్ – కార్పొరేషన్ విజయం
మహాశివరాత్రి పర్వదినాన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు తమకు విజయం అందించడం ఒక గిఫ్ట్లా భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




