Monday, March 2, 2026
Homeతాజా సమాచారంఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో కారు ప్రమాదం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు – కలెక్టర్ బి. చంద్రశేఖర్

ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో కారు ప్రమాదం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు – కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 8

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద ఉన్న ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో శనివారం రాత్రి కారు అదుపు తప్పి పడిపోయిన ఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ఆదివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి కలెక్టర్ ముకుందాపురం వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘటనకు గల కారణాలు, ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు, ఇతర అంశాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

భార్య మృతి – భర్త గల్లంతు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంప సాగర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పుల్లయ్య, పద్మ ప్రయాణిస్తున్న కారు ముకుందాపురం వద్ద ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో అదుపు తప్పి పడిపోయిందని తెలిపారు.విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, గజ ఈతగాళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. రాత్రి సమయం కావడంతో కారును వెంటనే బయటకు తీయలేకపోయామని, ఆదివారం ఉదయం రెస్క్యూ బృందాలు కారును బయటకు తీశాయని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో పద్మ మృతదేహం లభ్యమైందని, భర్త పుల్లయ్య మృతదేహం ఇంకా గల్లంతులో ఉందని తెలిపారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ సమన్వయంతో గాలింపు చర్యలు

అన్ని శాఖల సమన్వయంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ కార్యాచరణలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా సహకరిస్తోందని కలెక్టర్ తెలిపారు.

శాఖల సమన్వయంతో సహాయక చర్యలు – ఎస్పీ

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. కారును గుర్తించినప్పటికీ చీకటి కారణంగా శనివారం వెలికితీయలేకపోయామని, ఆదివారం ఉదయం కారుతో పాటు మహిళ మృతదేహాన్ని వెలికి తీశామని అన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కూడా త్వరలో వెలికి తీస్తామని తెలిపారు.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments