డైనమిక్ న్యూస్, నల్లగొండ బ్యూరో ,ఫిబ్రవరి 02
పలకా–బలపం పట్టి పాఠశాలల్లో చదవాల్సిన పసిబాల్యాన్ని వెట్టిచాకిరీ నుంచి విడిపించి, వారి భవిష్యత్తుకు వెలుగు నింపుతోంది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా ఒక్క జనవరి నెలలోనే 92 కేసులు నమోదు చేసి 118 మంది బాల కార్మికులను రెస్క్యూ చేసి రికార్డు సృష్టించింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమాల లక్ష్యం బాల కార్మికులు, వీధి బాలలు, ఇటుక బట్టీల్లో నిర్బంధిత కార్మికులు, ముష్టి మాఫియా చేతుల్లో చిక్కుకున్న బాలలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి వారిని విముక్తి చేయడం.
మూడు సబ్ డివిజన్లలో సమన్వయంతో ప్రత్యేక టీమ్లు
నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ.హెచ్.టి.యు పోలీస్ సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు కలిసి ప్రత్యేక టీమ్లుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
105 మంది బాలురు – 13 మంది బాలికలు
రెస్క్యూ చేసిన 118 మందిలో
👉 105 మంది బాలురు
👉 13 మంది బాలికలు
వీరిలో ఎక్కువ మంది బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.రెస్క్యూ చేసిన పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు.
బాల కార్మికులకు పని కల్పిస్తే కఠిన చర్యలు : ఎస్పీ
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.బాలలతో పని చేయించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి
వీధి బాలలు లేదా బాల కార్మికులు కనిపించిన వెంటనే
📞 డయల్ 100
📞 1098 చైల్డ్ హెల్ప్లైన్
లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఉత్తమ సేవలకు అభినందనలు – రివార్డ్ ప్రకటన
ఆపరేషన్ స్మైల్లో భాగంగా నెల రోజుల పాటు అంకితభావంతో పనిచేసిన ఏ.హెచ్.టి.యు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
