నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 17
నేరేడు చర్ల మండల పరిధిలోని నూతన గ్రామ పంచాయతీ లాల్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన కటికోల పున్నయ్య–సీతమ్మ అనే నిరుపేద వృద్ధ దంపతుల జీవితంలో అనుకోని అనారోగ్యం తీవ్ర కష్టాలను తెచ్చిపెట్టింది. పున్నయ్యకు కాలులో తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు.
లేవలేని పరిస్థితిలో పున్నయ్య
కాలుకు వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా పున్నయ్య నడవలేని, లేవలేని స్థితికి చేరుకున్నారు. రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగించే ఈ కుటుంబానికి అనారోగ్యం పెద్ద భారంగా మారింది. “రెక్కాడితే కానీ డొక్కాడని” పరిస్థితిలో ఉన్న పున్నయ్యకు వైద్య చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భార్య సీతమ్మ ఆవేదన
భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో భార్య సీతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఆసరా లేకుండా జీవించాల్సిన పరిస్థితి రావడంతో వారి జీవితం దుర్భరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మానవత్వంతో ముందుకొచ్చిన యువకులు
వృద్ధ దంపతుల పరిస్థితిని తెలుసుకున్న అనంతు శ్రీను, పుల్లెంల సతీష్, పర్వతం రమేష్లు శనివారం వారి ఇంటికి వెళ్లి రూ.3,000 నగదు ఆర్థిక సహాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం చేసినట్లు తెలిపారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా అనంతు శ్రీను మాట్లాడుతూ పున్నయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన సమయంలో మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్పందించాల్సిన అధికారులు
ఇలాంటి నిరుపేద వృద్ధ కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వైద్య, ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ 5వ వార్డు మెంబర్ పర్వతం చంద్రగిరి పాల్గొన్నారు
