సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 13
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి పల్లె నుంచి ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్–2025 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి కలెక్టర్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు సాగింది.
గ్రామం నుంచి గ్లోబల్ స్థాయికి అవకాశం
ర్యాలీ అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం కప్ పోటీల ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమేనని స్పష్టం చేశారు. యువత తమ ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి చేరేందుకు ఈ పోటీలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
44 క్రీడల్లో పోటీలు – విస్తృత షెడ్యూల్
సీఎం కప్–2025 పోటీలు 44 క్రీడల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.గ్రామ స్థాయిలో జనవరి 17 నుంచి 22 వరకు,మండల స్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు,నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు,జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు,
రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు పోటీలు జరుగుతాయని వివరించారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అర్హత కలిగిన యువత stag.telangana.gov.in పోర్టల్ ద్వారా లేదా గూగుల్లో “CM Cup” అని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధిక సంఖ్యలో యువత పాల్గొని అవార్డులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
యువత శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరం – ఎస్పీ
జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ, గ్రామీణ యువత క్రీడా ప్రతిభను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు ఆటలు, కళలు, సంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సహించాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటరెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్పీఓ నారాయణరెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
