సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 27
సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే APK ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నకిలీ APK ఫైల్స్తో సైబర్ మోసాలు
వాట్సప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పోలీస్ చలాన్, RTA చలాన్, ప్రభుత్వ పథకాలు పేరుతో నకిలీ APK ఫైల్ లింకులు పంపిస్తూ సైబర్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఎస్పీ తెలిపారు.
apk లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ పూర్తిగా మోసగాళ్ల ఆధీనంలోకి
ఈ APK ఫైల్స్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మొబైల్ పూర్తిగా సైబర్ మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతుందని, ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, డేటా దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా, మొబైల్ను వినియోగించి బ్యాంక్ ఖాతాలోని డబ్బును కూడా కాజేసే అవకాశం ఉందన్నారు.
ఇవి సైబర్ మోసగాళ్ల సృష్టి మాత్రమే
APK ఫైల్స్ అనేవి పూర్తిగా సైబర్ మోసగాళ్ల ఎత్తుగడ మాత్రమేనని, వీటిని నమ్మితే ఫోన్ హ్యాక్ అయినట్టేనని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ విధమైన కొత్త పన్నాగంతో ముందుకు వస్తున్నారని తెలిపారు.
అధికారిక సమాచారానికే ప్రాధాన్యం
ప్రజలు అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రభుత్వ వెబ్సైట్లు, అధికారిక యాప్లు వినియోగించాలని సూచించారు.అనుమానాస్పద లింకులు, సందేశాలు అందిన వెంటనే వాటిని పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు.
సైబర్ మోసాలకు లోనుకావద్దు
“సైబర్ మోసగాళ్ల పన్నాగాలకు లోనుకాకండి. మీ భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి” అని జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
