నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 4
మూడవ దశలో నామినేషన్ దాఖలు చేస్తున్న బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు మాజి మండల పార్టీ అధ్యక్షులు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి జరగాలంటే పంచాయతీ వ్యవస్థకు పటిష్ఠత అవసరమని అన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే గ్రామాల దుస్థితికి కారణం
గత ప్రభుత్వాలు పంచాయతీలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని పవన్ కుమార్ యాదవ్ విమర్శించారు.నీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల లోపాలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు
ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తున్న సీసీ రోడ్లు, వీధి లైట్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు వంటి అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంచాయతీల బిల్లులు కూడా క్లియర్ చేయకుండా గ్రామాలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు.
బీజేపీ లక్ష్యం గ్రామ సేవే
బీజేపీ ప్రధాన లక్ష్యమే గ్రామాభివృద్ధి అని పవన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పార్టీకి అవకాశం ఇస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
పారదర్శక పాలనకు హామీ
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రూపాయి ప్రజల కోసం వినియోగమవుతున్నదీ ప్రజలకే తెలిసేలా పారదర్శకంగా పాలన సాగిస్తామని అన్నారు.వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రామాలను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామన్నారు.
