నేరేడుచర్ల, నవంబర్ 17, డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో శిశు మంది స్కూల్ నుండి కనకదుర్గ ఆలయం వరకు కిలోమీటరు మేర చేపడుతున్న సీసీ రోడ్డు పనుల్లో నడిరోడ్డు మధ్య భాగంలోనే మిషన్ భగీరథ పైపు లైన్లు అడ్డుపడటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సీసీ రోడ్డు వేస్తున్న సమయంలోనే పైపులు అలాగే ఉండటం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
సీసీ రోడ్డుకు సెంటర్లోనే అడ్డుపడుతున్న పైపులు
50 ఫీట్ల వెడల్పున్న ఈ రహదారిలో ఇరువైపులా 13 ఫీట్లు వదిలి మధ్యలో 24 ఫీట్లలో సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే ఈ సెంటర్ భాగంలోనే మిషన్ భగీరథ వాటర్ పైపులు అడ్డుగా కొనసాగుతుండటం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతోంది.రోడ్డు పనులు ప్రారంభించే ముందు అధికారులు ఈ పైపులు గమనించలేదా? ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?” అని స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల సమన్వయం లోపించిందని ప్రజల ఆవేదన
మిషన్ భగీరథ శాఖ, మున్సిపల్ శాఖ, కాంట్రాక్టర్—ఈ మూడు విభాగాలు కలిసి ముందుగానే పైప్లైన్ను తొలగించి తర్వాతే సీసీ రోడ్డు వేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు.కాని ఎలాంటి ప్రాథమిక పరిశీలన లేకుండానే పనులు కొనసాగడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
“ఈ పరిస్థితిలో సీసీ రోడ్డు ఎలా వేస్తారు?” – విశ్వనాథం ప్రశ్న
స్థానిక సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది విశ్వనాథం మాట్లాడుతూ— “నడిరోడ్డులో అడ్డుగా పైపులు ఉన్నప్పుడు వాటిని తొలగించకుండా సీసీ రోడ్డు వేయడం ఎంతవరకు సమంజసం? ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం.” అని తీవ్రంగా విమర్శించారు.
ప్రజల్లో ఆగ్రహం – సమస్యను వెంటనే పరిష్కరించాలి
ప్రాంత ప్రజలు వెంటనే నడిరోడ్డు మధ్యలో ఉన్న మిషన్ భగీరథ పైపులను తొలగించించి, సీసీ రోడ్డు పనులను సక్రమంగా కొనసాగించాలని మున్సిపాల్టీని డిమాండ్ చేస్తున్నారు.“ప్రణాళిక లేకుండా పనులు ప్రారంభించడం ప్రజల ధనాన్ని, సమయాన్ని వృథా చేయడమే” అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డినీ వివరణ
రోడ్డు మధ్యలో మిషన్ భగీరథ పైపు వున్నది. మాట వాస్తవమే కాని ప్రజెంట్ సీసీ రోడ్డు పనులు నడుస్తున్నాయి.నిర్మాణం జరిగిన కూడా రోడ్డును తొలగించకుండా ప్రత్యామ్నాయంగా పైపును కట్ చేసి వేరే మార్గం వున్నది కాబట్టీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు
