సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 13
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు .జిల్లాలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలు జరగకుండా ప్రతి శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రోడ్ల లోపం, భద్రతా ప్రమాణాల లోపం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు వారం రోజుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి గుంటలు పూడ్చి, కాంక్రీట్ వేయాలని, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రమాద ప్రాంతాలలో రేడియం స్టిక్కర్లు, స్టడ్స్ లైట్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే మున్సిపల్ పరిధిలో కమిషనర్లు అంతర్గత రోడ్లను తనిఖీ చేసి వర్షాకాలం కారణంగా పాడైన రోడ్లను మరమ్మత్తు చేయాలని ఆయన ఆదేశించారు.
నేషనల్ హైవేల్లో సూచిక బోర్డులు తప్పనిసరి
నేషనల్ హైవే అథారిటీ అధికారులు హైవేలపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, సర్వీస్ రోడ్ల వెంట సూచిక బోర్డులు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో నేషనల్ హైవే లలో 22 చోట్ల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ ప్రధాన లక్ష్యం — ఎస్పీ నరసింహ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలను కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం” అని అన్నారు.2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల మరణాల రేటు 16 శాతానికి తగ్గించగలిగామని, ప్రస్తుతం 43 బ్లాక్ స్పాట్స్ను గుర్తించి 43 గ్రామ రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే ఈ కమిటీ సభ్యులు పోలీసులకు, 108 వాహనాలకు సమాచారం అందించి ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ వివరించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి మాధవి, డిపిఓ యాదగిరి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, నేషనల్ హైవే అధికారి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
