నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్13
నల్లగొండ జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నమైన పద్ధతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.నేషనల్ హైవే–65లోని చిట్యాల మండలం వెలిమినేడు వద్ద “నీ వాహనం వేగంగా వెళ్తుంది. కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదంతో ప్రత్యేక హోల్డింగ్ ఏర్పాటు చేశారు.యాక్సిడెంట్కి గురైన కారును ప్రదర్శనగా ఉంచి వాహనదారులకు రోడ్డు భద్రతపై సందేశం అందించారు.
“ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి” – జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ
“ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన అవసరం.అతివేగంగా వాహనం నడపడం, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్యాలు అనేక ప్రాణాలను బలితీస్తున్నాయి” అని తెలిపారు. వాహనదారులు రోడ్డు సూచికలను గమనిస్తూ, వేగపరిమితిని పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.ఇలాంటి హోల్డింగులు చూసి ప్రజలు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి ప్రేరణ పొందుతారని అన్నారు.
ప్రమాద ప్రాంతాలపై క్షుణ్ణ పరిశీలన – తగు నియంత్రణ చర్యలు
జిల్లా పోలీసులు తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తున్నారని ఎస్పీ తెలిపారు.అవసరమైన చోట రోడ్డు సూచికలు, సిగ్నల్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ నాగరాజు, ఎస్ఐ మధు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
