సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్13
సూర్యాపేట జిల్లా పోలీసు అధికారి కె.నరసింహ గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ మహిళా భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాలను సందర్శించి రికార్డులు, కార్యకలాపాలను పరిశీలించారు.
“వేదింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి” – ఎస్పీ పిలుపు
వేదింపులు, దాడులకు గురైన మహిళలు, పిల్లలు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. “వేదింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే వాటిని అరికట్టవచ్చు” అని ఆయన అన్నారు.
భరోసా సెంటర్ ద్వారా సమగ్ర సేవలు
మహిళలు, బాలలకు న్యాయపరమైన, వైద్యపరమైన, సామాజిక భద్రత, మానసిక ధైర్యం, విద్య వంటి అన్ని సదుపాయాలు ఒకే చోట అందించే విధంగా రాష్ట్ర పోలీస్ మహిళా అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారని ఎస్పీ తెలిపారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
లైంగిక దాడులపై కఠిన చర్యలు తప్పవు
పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పోక్సో చట్టం కింద జీవితఖైదు వరకు శిక్షలు పడుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. “సాంకేతిక ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు జరిపి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో శిక్షలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.
అవగాహన కార్యక్రమాలు, కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు
మహిళలు, పిల్లల రక్షణలో మానవతా దృక్పథంతో పని చేయాలని, వారికి భద్రతా భావం కల్పించాలని ఎస్పీ సూచించారు. విద్యాసంస్థలు, పట్టణాలు, కాలనీల్లో భద్రతా చట్టాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.రద్దీ ప్రాంతాల్లో ఆకతాయిలపై నిఘా ఉంచాలని, విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు, వేదింపులు చోటు చేసుకున్న వెంటనే చర్యలు తీసుకునేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో భరోసా సెంటర్ మహిళా ఏఎస్ఐ సైదావి, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
