సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11, డైనమిక్
డిల్లీలో సోమవారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ హైఅలర్ట్ లోకి మారింది. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించారు.
బస్టాండ్లలో కమ్మిన పోలీసు కవచం
కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి ప్రతి మూలను జాగ్రత్తగా తనిఖీ చేశారు. బస్సులు, ప్రయాణికుల లగేజీ, దుకాణాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు.
మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాలపై నిఘా
తనిఖీల ప్రధాన లక్ష్యం పట్టణంలో భద్రతా వాతావరణం నెలకొల్పడంతోపాటు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడమేనని పోలీసులు తెలిపారు. కొత్తగా పట్టణానికి వచ్చిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
లాడ్జ్ యజమానులకు హెచ్చరిక
గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు వసతి కల్పించరాదని లాడ్జ్ యజమానులను పోలీసులు హెచ్చరించారు. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం తనిఖీల్లో పాల్గొన్నారు.
ప్రజలకు ఎస్పీ నరసింహ సందేశం
“జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల భద్రత పోలీసు శాఖకే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత కూడా.ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారమివ్వాలి.ప్రజాస్థలాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. బ్యాగులు, ప్యాకేజీలు వదిలిపెట్టరాదు.భద్రతా తనిఖీల సమయంలో పోలీసులు ఇచ్చే సూచనలకు సహకరించాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాం,” అని ఎస్పీ నరసింహ తెలిపారు.


