సూర్యాపేట బ్యూరో, నవంబర్ 7, డైనమిక్
వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించడం మనకు దొరికిన విశిష్టమైన అవకాశం అని సూర్యాపేట అదనపు జిల్లా కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఉద్యోగులతో కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
భారత స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతం
ఈ సందర్భంగా మాట్లాడుతూ కె. సీతారామారావు చెప్పారు —
“బంకింఛంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గీతం కోట్లాది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించింది. ‘భారతమాత నీకు వందనం, గలగల పారే ప్రవాహాలతో మలయమారుతముల చల్లని గాలులతో, సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు’ అని ఈ గేయం దేశ మాతను స్తుతిస్తూ రాసినదని” అన్నారు.బెంగాల్ విభజన అనంతరం వందేమాతరం గీతం దేశమంతటా ప్రసిద్ధి చెందినట్లు పేర్కొన్నారు. “ఈ గేయం నేటికీ ప్రతి భారతీయుని నోట మ్రోగుతూ దేశ ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తోంది” అని తెలిపారు.


కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నరసింహ, గిరిజన సంక్షేమ అధికారి శంకర్, స్త్రీ-శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి, శ్రీలత, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
