వాషింగ్టన్, డైనమిక్ న్యూస్, నవంబర్ 25
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా వైఖరిని వైట్హౌస్ ఘనంగా సమర్థించింది. విదేశీ నిపుణులను పూర్తిగా నిరాకరించాలన్న ఉద్దేశ్యంతో కాదు, అమెరికాకు దీర్ఘకాలికంగా లాభం చేకూరే విధంగా ట్రంప్ అభిప్రాయాలు ఉన్నాయని శ్వేతసౌధం స్పష్టం చేసింది.
వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ—
“అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తమ ప్రత్యేక ఉత్పత్తులకు అవసరమైన నిపుణులను ప్రారంభ దశలో తెచ్చుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్టరీలు స్థిరపడే వరకు వారికి అవకాశం ఇవ్వాలన్నదే ట్రంప్ అభిప్రాయం. అయితే ఆ తర్వాత ఆ ఉద్యోగాల్లో అమెరికన్ పౌరులే ఉండాలన్నది ఆయన స్పష్టమైన లక్ష్యం” అని తెలిపారు.యూఎస్–సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది.అరిజోనాలో బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసే చిప్ తయారీ ఫ్యాక్టరీని కేవలం స్థానిక నిరుద్యోగ యువతతో వెంటనే నడపడం అసాధ్యం. తొలి దశలో వేల మందిని విదేశాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిపుణులకు నేను స్వాగతం పలుకుతాను” అని ట్రంప్ ఆ కార్యక్రమంలో ప్రకటించారు. విదేశీ నిపుణులు వచ్చి అమెరికన్లకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను పెంచడమే లక్ష్యమని ఆయన వివరించారు.ఇక ఈ వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలోనే చర్చనీయాంశమవుతున్నాయి. కన్జర్వేటివ్ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా, తన విధానం ప్రాక్టికల్గా ఉందనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.2024లో మంజూరైన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70% పైగా భారతీయులదే.వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవటం కోసం కొత్త దరఖాస్తులపై $100,000 ఫీజు విధించడం కూడా కీలక నిర్ణయమని వైట్హౌస్ సూచించింది.
