హైదరాబాద్, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్17
తెలంగాణ విజయ డైరీ పాల ఉత్పత్తుల సరఫరాను మరింత వేగవంతం చేయడానికి మూడు నూతన వాహనాలను రాష్ట్ర డైరీ కార్పొరేషన్ సోమవారం సేవలోకి తీసుకొచ్చింది. విజయ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, యం.డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
విజయ భవన్ నుంచి మూడు మార్గాలకు పంపిణీ
వాహనాలు ఆదిలాబాద్, సిద్దిపేట, వరంగల్ మార్గాల్లో పాల ఉత్పత్తుల సరఫరా కోసం ఉపయోగించనున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు పాల ఉత్పత్తులు వేగంగా, నాణ్యతతో చేరేలా ప్రయత్నాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
పంపిణీ వ్యవస్థ విస్తరణపై చైర్మన్ దృష్టి
తెలంగాణ విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాన్ని మరింత విస్తరించేందుకు ఆయా ప్రాంతాల్లో కొత్త రీజనల్ పంపిణీదారులను నియమించనున్నట్టు చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చెప్పారు.పాల ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉత్పత్తుల చేరికను నిరాటంకంగా చేయడం లక్ష్యం
ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రైతులకు కూడా స్థిరమైన మార్కెట్ అందుబాటులోకి వస్తుందని డైరీ అధికారులు వెల్లడించారు. ఈ వాహనాల ప్రారంభంతో తెలంగాణ విజయ డైరీ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు.
