సీఐఐ సమ్మిట్లో కీలక ఒప్పందాలు
20 లక్షల ఉద్యోగాల దిశగా ప్రభుత్వం అడుగులు
డైనమిక్ న్యూ, గుంటూరు, నవంబర్ 15
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరిశ్రమల పెట్టుబడులకు ‘స్వర్గధామం’గా మారిందని అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు హాజరైన అనంతరం శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
సమ్మిట్తో ఏపీకి బంగారు భవిష్యత్తు
సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక అగ్రరాజ్యాల దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నదని ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు. రెండురోజుల కాలంలో అంతర్జాతీయ–జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడులు ఆకర్షించిందని తెలిపారు.
₹5.22 లక్షల కోట్ల పెట్టుబడులు – 2.67 లక్షల ఉద్యోగాలు
ఇప్పటి వరకు ₹5,22,471 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 2,67,239 ఉద్యోగావకాశాలు సృష్టించబడనున్నాయని ఎమ్మెల్యే వివరించారు. విండ్–సోలార్ హైబ్రిడ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోఫ్యూయల్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, అగ్రివోల్టాయిక్స్ వంటి ఆధునిక శక్తి రంగాల్లో ప్రపంచ దిగ్గజాల ఆసక్తి రాష్ట్ర సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసిందని తెలిపారు.
గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు
వైసీపీ పాలనలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులనే తరిమికొట్టారని, దీంతో యువత భవిత అంధకారంలోకి నెట్టబడ్డారని నసీర్ అహమ్మద్ మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ చేసే విమర్శలు ప్రజలకు హాస్యాస్పదంగా మారాయని ఎద్దేవా చేశారు.
20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తును ప్రధాన అజెండాగా పెట్టుకుని 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు.
