నల్లగొండ బ్యూరో,డైనమిక్, నవంబర్ 15
జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
పూర్తయిన ఇళ్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తిగా పారదర్శకంగా పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం నాటికి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని, లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నచోట శుక్రవారం లాటరీ విధానంలో ఎంపిక చేయాలని సూచించారు.
శనివారం నాటికి ప్రొసీడింగ్స్ సిద్ధం
ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి అవసరమైన ప్రొసీడింగ్స్ను శనివారం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక శాసనసభ్యుల సమ్మతితో ప్రజా ప్రతినిధులు, మంత్రుల ద్వారా ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
వీడియోగ్రఫీతో లాటరీ ప్రక్రియ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా జీవో నిబంధనల మేరకు మొత్తం వ్యవహారాన్ని నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు.
లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బ్యాలెన్స్ విడుదల
కొన్ని ఇళ్లకు ఇప్పటికే ప్రభుత్వం చెల్లింపులు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన తర్వాత మిగిలిన బకాయి మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ వివరాలు లబ్ధిదారులకు స్పష్టంగా తెలియజేయాలని గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్కు ఆదేశాలు జారీ చేశారు.
ఇండ్ల పంపిణీలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం
ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సూచించారు.
అధికారుల పాల్గొనం
ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
