డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, ఫిబ్రవరి 3
మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల కోడ్తో పాటు 30 పోలీస్ యాక్ట్ను కఠినంగా అమలు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రవీందర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు.
అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిషేధం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్ఐ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
వాహనాల వినియోగానికి ప్రత్యేక పర్మిషన్
ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ద్వారా అనుమతి పొందాలని తెలిపారు. అనుమతి లేని వాహనాలు పట్టుబడితే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత అభ్యర్థులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
మైక్ వినియోగం, సభలకు ఆర్డీవో – డీఎస్పీ అనుమతి తప్పనిసరి
మైక్ వినియోగం, బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆర్డీవో మరియు డీఎస్పీ ద్వారా అనుమతి తీసుకోవాలని ఎస్ఐ రవీందర్ తెలిపారు. నిర్ణీత సమయాలను మించకుండా, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
రోడ్లపై గుమ్మిగూడితే చర్యలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు రోడ్లపై గుమ్మిగూడడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమాన అవకాశాలు – న్యాయమైన ఎన్నికలే లక్ష్యం
ఎన్నికల కోడ్ అమలులో ఉద్దేశ్యం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడం, ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించడమేనని ఎస్ఐ తెలిపారు.
అభ్యర్థులు సహకరించాలి
అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని పాటించాలని, ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ఎస్ఐ హెచ్చరించారు.
