డైనమిక్ న్యూస్, మోతే, ఏప్రిల్ 2
మోతే మండలం నామవరం గ్రామంలో కన్నతల్లిని పట్టించుకోని కుమారుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు వీధిపాలైన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95)కు ముగ్గురు కుమారులు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య ఉన్నారు.
భూమి పంచుకున్నాక తల్లిని నిర్లక్ష్యం
2021లో తమ తల్లిని చూసుకుంటామని చెప్పి మూడు ఎకరాల 9 గుంటల భూమిని ముగ్గురు కుమారులు పంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే అనంతరం తల్లిని సరిగా చూసుకోకుండా, అన్నం కూడా పెట్టకుండా బయటకు పంపించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆర్డీఓ ఆదేశాలు అమలు కాని పరిస్థితి
2024లో బాధితురాలు సూర్యాపేట ఆర్డీఓను ఆశ్రయించగా, ప్రతి కుమారుడు నెలకు రూ.1500 చొప్పున వృద్ధురాలి ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ కుమారులు ఆ ఆదేశాలను పట్టించుకోలేదని తెలిసింది.
కుమార్తెలే ఆదరణ
ప్రస్తుతం నామవరం సమీపంలో ఉన్న పెద్ద కుమార్తె తిరుమలగిరి లింగమ్మ వృద్ధురాలిని చూసుకుంటున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
ప్రమాదంతో పరిస్థితి మరింత విషమం
ఇటీవల మార్చి 23న వృద్ధురాలు కిందపడటంతో తొడ విరిగింది. ప్రస్తుతం ఆమెను సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమార్తెలు చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.
కుమారుల నిర్లక్ష్యం కొనసాగుతూనే
ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న కుమారుడికి తెలియజేయగా, “డబ్బులు లేవు” అంటూ స్పందించాడని, మరో కుమారుడు “రాలేకపోతున్నాను” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అధికారుల జోక్యం కోరుతున్న వృద్ధురాలు
తన బాధను గుర్తించి గ్రామ పెద్దలు, అధికారులు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.
