సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ మార్చి 4
గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఐదు రోజుల శిక్షణ – మూడో విడత ప్రారంభం
ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడో విడత శిక్షణలో సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్), మునగాల, చివ్వేంల, పెన్పహాడ్ మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొంటున్నారు.
పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీ పనుల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై శిక్షణలో సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
సాంకేతికత వినియోగంతో ఆదర్శ గ్రామాల దిశగా
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రజా సౌకర్యాల మెరుగుదలకు డిజిటల్ విధానాలపై దృష్టి పెట్టాలని సర్పంచులకు సూచించారు. ప్రతి ఒక్కరూ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, వివిధ మండలాల సర్పంచులు పాల్గొన్నారు.


