నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 8
రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు స్వగ్రామాలు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే వారు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పండుగల నేపథ్యంలో ప్రత్యేక నిఘా
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రద్దీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, కాలనీలు, ప్రభుత్వ–ప్రైవేట్ భవనాలు, ఆర్థిక సంస్థల వద్ద ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు
పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు అమలు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. నైట్ పెట్రోలింగ్తో పాటు కాలనీలు, అపార్ట్మెంట్లలో పోలీస్ సిబ్బంది తరచూ సందర్శనలు చేస్తున్నట్లు తెలిపారు.
దొంగతనాల నివారణకు పోలీస్ సూచనలు
ఇళ్లకు తాళం వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగా మూసివేశామా లేదా అని నిర్ధారించు కోవాలని సూచించారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ముఖ్యమైన పత్రాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్ లలో లేదా విశ్వసనీయ వ్యక్తుల వద్ద భద్ర పరచుకోవాలని తెలిపారు.ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం రాకుండా టైమర్ లైట్లు ఏర్పాటు చేయడం, రాత్రివేళ కనీసం ఒక గదిలో లైట్ వెలిగేలా చూడాలని సూచించారు. ఇంటి ముందు పత్రికలు, పాలు, పార్సెల్స్ పేరుకుపోకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
సీసీటీవీ, అలారమ్లతో అదనపు భద్రత
సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. తాళాలను తలుపుల దగ్గర, పూల కుండీలలో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టకూడదని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో జాగ్రత్త
“ఊరికి వెళ్లాం”, “ఇంట్లో లేను” వంటి వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేయడం నివారించాలని ఎస్పీ సూచించారు. పొరుగువారితో సమన్వయం చేసుకుంటూ పరస్పరంగా ఇళ్లపై నిఘా ఉంచుకోవాలని కోరారు.
అపార్ట్మెంట్లు, కాలనీల్లో అప్రమత్తత
అపార్ట్మెంట్లు, కాలనీల్లో వాచ్మన్లను అప్రమత్తం చేసి గేట్లు సరిగా మూసేలా చూడాలని తెలిపారు. అద్దె ఇళ్ల యజమానులు ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంటి చుట్టూ ఉన్న పొదలు, చెట్లు కత్తిరించి స్పష్టమైన విజిబిలిటీ ఉండేలా చూడాలని అన్నారు.
అనుమానాస్పద సమాచారం వెంటనే తెలియజేయాలి
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్న ఎస్పీ, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని, నల్లగొండ జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు
