నల్గొండ సబ్ డివిజన్లో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు
డైనమిక్,నల్గొండ బ్యూరో,అక్టోబర్18
నల్గొండ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి సబ్ డివిజన్లోని అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు శనివారం సాయంత్రం నల్గొండ హెడ్క్వార్టర్స్లోని టిటిసి వద్ద జరిగింది.
డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ
ఇటీవల రాష్ట్రంలో స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురై చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి డ్రైవర్, పాఠశాల యాజమాన్యం పూర్తి బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
విద్యార్థుల భద్రత ప్రాధాన్యం
డీఎస్పీ సూచించిన ముఖ్యాంశాలు:
డ్రైవర్ల ఎంపికలో రోడ్డు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
అనుభవం, సీనియారిటీ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించాలి.
ప్రతి బస్సులో కేర్ టేకర్ తప్పనిసరిగా ఉండాలి.
బస్సులలో డాష్బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి — ప్రమాద సమయంలో ఇవి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.
పిల్లలు బస్సులో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
డ్రైవర్ సమయపాలన పాటించి, నిర్లక్ష్యం చూపరాదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
బస్సులకు సంబంధించిన అన్ని పత్రాలు పూర్తి స్థాయిలో ఉండాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే మొబైల్ ఫోన్తో మాట్లాడడం, పరధ్యానంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారి తీస్తుందని, అలాంటి నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వరాదని అన్నారు.
రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ
కార్యక్రమం ముగిసిన అనంతరం డ్రైవర్లు అందరూ కలిసి రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎంమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, ఎస్సైలు సైదులు, జయకర్, నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబు, ప్రైవేట్ పాఠశాలల యాజమానులు, బస్సు డ్రైవర్లు తదితరులు సుమారు 150మంది పాల్గొన్నారు.
