అమరావతి, ఏపి డైనమిక్ డెస్క్, అక్టోబర్ 27
ట్రంప్ ప్రభుత్వం విధించిన అదనపు టారిఫ్ల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న బ్రాండిక్స్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పరిస్థితిని త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లి ఉపశమన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్ మరియు భారతీయ భాగస్వామి పి.సి. దొరస్వామి సోమవారం మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.దొరస్వామి వివరించిన ప్రకారం, ఎస్ఈజెడ్ పరిధిలోని బ్రాండిక్స్ సంస్థ 80 శాతం అమెరికా ఎగుమతులపై ఆధారపడినది. అమెరికా మార్కెట్లో టారిఫ్లు 50 శాతం వరకు పెరగడంతో పోటీ పడడం అసాధ్యమైందని, ఫలితంగా కొన్ని యూనిట్లలో ఉద్యోగులకు సెలవులు ప్రకటించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
మంత్రి లోకేష్ స్పందన
బ్రాండిక్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్న లోకేష్, “ఇది కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, లక్ష మందికి ఉపాధి కల్పించి గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న సామాజిక శక్తి” అని అన్నారు. ఉద్యోగుల భద్రతకు ఎటువంటి ముప్పు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరించనుందని హామీ ఇచ్చారు.
దొరస్వామి సూచించిన ముఖ్య అంశాలు:
సంస్థ దిగుమతి చేసే ముడి పదార్థాలపైనే సుంకం విధించాలని.ఎస్ఈజెడ్ యూనిట్లకు RoSCTL ప్రయోజనాలు 5% రేటుతో మళ్లీ అమలు చేయాలని.ఎస్ఈజెడ్ యూనిట్లు దేశీయ మార్కెట్ తయారీదారులతో సబ్కాంట్రాక్టింగ్ చేయడానికి అనుమతించాలని కోరారు.ఈ అంశాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని, ఉద్యోగాలు దెబ్బతినకుండా కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి త్వరితగతిన చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
