డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 6
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక బాసటగా రూ.1 కోటి ఇన్స్యూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ నరసింహ గురువారం అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత
కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంబ సభ్యులకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద ఈ ఇన్స్యూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.
పోలీసు కుటుంబాలకు ఎస్బీఐ సాలరీ ప్యాకేజీతో భరోసా
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, “పోలీసు సిబ్బంది కోసం ఎస్బీఐ రూపొందించిన సాలరీ ప్యాకేజీ అకౌంట్ ద్వారా మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులకు రూ.1 కోటి ఇన్స్యూరెన్స్ అందించడం పోలీసు కుటుంబాలకు గొప్ప ఆర్థిక బలం ఇస్తోంది” అన్నారు.అలాగే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రయాణ సమయంలో భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఈ పథకాన్ని రూపొందించిన ఎస్బీఐ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, AO మంజు భార్గవి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అనిల్ కుమార్, మోహన్ కుమార్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
