Monday, March 2, 2026
Homeతాజా సమాచారంఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,25 జనవరి

16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయి బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

యువత చైతన్యమే బలమైన ప్రజాస్వామ్యం

దేశంలోని యువతను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఓటరు చైతన్యవంతుడిగా మారాలని సూచించారు.

గ్రామీణ ఓటర్లు ముందుండాలి – పట్టణాల్లో నిర్లక్ష్యం

ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 80 శాతం ఓటింగ్ నమోదైందని, అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో మాత్రం కేవలం 60 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైందన్నారు. మహిళా ఓటర్ల శాతం అధికంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.

ప్రజల అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించేది ఓటుతోనే

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించాలంటే ఓటే ప్రధాన మార్గమని తెలిపారు.

ఎస్ఐఆర్‌లో 74 శాతం పూర్తి – జాతీయ స్థాయిలో అవార్డు

జిల్లాలో గ్రామ స్థాయిలో ప్రతి ఓటరును నమోదు చేసి ఎస్ఐఆర్ ప్రక్రియను 74 శాతం పూర్తిచేసినందుకు జాతీయస్థాయిలో అవార్డు రావడం పట్ల ఈఆర్వోలు, బిఎల్ఓలను కలెక్టర్ అభినందించారు.

కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ

18 సంవత్సరాలు నిండిన కొత్తగా ఓటు హక్కు పొందిన ఐదుగురికి జిల్లా కలెక్టర్ ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు.

‘సండే సైకిల్’ ర్యాలీకి ప్రారంభం

ఓటరు అవగాహనతో పాటు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ‘సండే సైకిల్’ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, ఈఆర్వోలు, బిఎల్ఓలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments