నరసరావుపేట, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 16
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి తమ సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించారు.
112 అర్జీలు స్వీకరణ
ఈ కార్యక్రమంలో మొత్తం 112 అర్జీలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీకరించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళీ, ఆర్డిఓ మధులతతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాణ్యతతో పరిష్కారం చేయాలి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి అర్జీని నాణ్యతతో, బాధ్యతగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అర్జీలను యాంత్రికంగా కాకుండా సమస్య స్వభావాన్ని గుర్తించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
పిజిఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్
జిల్లాలోని అన్ని శాఖలు తమ పరిధిలోని పిజిఆర్ఎస్ అర్జీలపై గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని, పెండింగ్ ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
పెండింగ్ లేకుండా చర్యలు
భవిష్యత్తులో ఏ శాఖలోనూ పెండింగ్ అర్జీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్పష్టం చేశారు.
