హైదరాబాద్, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్)
మొంథా” తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్అండ్బీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
ఫీల్డ్ స్థాయిలో హై అలర్ట్గా ఉండాలి
బుధవారం మంత్రి ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడారు.అధికారులంతా ఫీల్డ్ స్థాయిలో హై అలర్ట్గా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు.
మాన్సూన్ సమయంలో చూపిన కృషి ప్రశంసనీయం
మాన్సూన్ సీజన్లో ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో తీసుకున్న జాగ్రత్త చర్యలు ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో ఈ తుఫాను సమయంలో కూడా పనిచేయాలని సూచించారు.
కాజ్ వేలు, కల్వర్ట్ల వద్ద హెచ్చరిక బోర్డులు
లో కాజ్ వేలు, కల్వర్ట్ల వద్ద ప్రమాద సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.
కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాల మానిటరింగ్
ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ను అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు.సర్కిల్ వారీగా జిల్లాల పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు.
ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు
అత్యవసర ప్రజా రవాణా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతిన్నా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు మంత్రి విజ్ఞప్తి
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరారు
