సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 13
జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
200 మీటర్ల పరిధిలో గుంపులు నిషేధం
పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్–2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా చేరరాదని సూచించారు.
సభలు, ర్యాలీలు, డీజేలు నిషేధం
పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, దర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేత
పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు.పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
