డైనమిక్ న్యూస్, జనవరి 29, నల్గొండ బ్యూరో
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలి
రౌడీ షీటర్లు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయకూడదని సూచించారు. ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
బైండోవర్ కేసులు నమోదు
నేర చరిత్ర ఉన్న వ్యక్తులందరినీ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి మంచి ప్రవర్తన పాటిస్తామని బాండ్ రాయించుకుంటామని తెలిపారు. బాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు
రౌడీ షీటర్ల కదలికలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, ఎలాంటి అనుమానాస్పద చర్యలు కనిపించినా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణకు అవకాశం
ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు అవసరమైతే జిల్లా బహిష్కరణ (ఎక్స్టర్న్మెంట్) చర్యలు కూడా తీసుకుంటామని డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరించారు.
సత్ప్రవర్తనతో జీవించాలి
పాత పద్ధతులు మానుకుని సమాజంలో గౌరవంగా జీవించాలని, లేదంటే చట్టపరమైన చర్యలతో పాటు వారి కుటుంబాల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు సైదులు, సతీష్, గోపాల్ రావుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
