సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 24
సూర్యాపేటలో జరుగుతున్న మేఘా జాబ్ మేళాకు విపరీతమైన స్పందన లభించడంతో, రెండో రోజు కూడా మేళాను కొనసాగించాలనీ శుక్రవారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
30 వేలమందికి పైగా నమోదు
ఇప్పటికే 30,000 మందికి పైగా నిరుద్యోగ యువతీ–యువకులు జాబ్ మేళాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ప్రతి అభ్యర్థి పాల్గొనేలా రెండో రోజు కూడా మేళాను కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ
ఈ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగంతో పాటు కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళాలో ఎక్కడా రద్దీ లేదా అవ్యవస్థలు చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.
పూర్తిస్థాయి ఏర్పాట్లు
మేళాలో పాల్గొంటున్న 255 పైగా పరిశ్రమల వివరాలను కేటగిరీ వారీగా విభజించి, ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అల్పాహారం, భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా సమకూర్చారు.
ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక ఆదేశాలు
హుజుర్నగర్లో జరుగుతున్న మేఘా జాబ్ మేళాకు తరలి వస్తున్న నిరుద్యోగుల సౌకర్యార్థం, ప్రతి ఆర్టీసీ బస్సు మేళా సమీపం వరకూ వెళ్లేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి సూచించారు.
ట్రాఫిక్, వాలంటీర్లతో క్రమబద్ధీకరణ
జాబ్ మేళా ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాలంటీర్ల సాయంతో నిరుద్యోగులను క్రమపద్ధతిలో మేళా ప్రాంగణంలోకి అనుమతించేలా చర్యలు చేపట్టారు.
మూడు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్
రెండో రోజు కొనసాగింపు విషయమై నల్లగొండ, భువనగిరి–యాదాద్రి జిల్లాల అధికారులతో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమాచారాన్ని తక్షణమే గ్రామ కార్యదర్శులు, గ్రామ పోలీస్ అధికారుల ద్వారా ప్రజలకు చేరవేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.
