మఠంపల్లి, అక్టోబర్ 28 (డైనమిక్ న్యూస్)
సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని లంబాడీలకు కేటాయించాలని హైకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూక్య కృష్ణ నాయక్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
సూర్యాపేటలో లంబాడీలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తిలలో లంబాడీలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు లంబాడీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి, ముఖ్యమైన పదవులలో అవకాశాలు ఇవ్వడం జరగలేదని విమర్శించారు.
మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకోవాలి
డిసిసి పదవిని లంబాడీలకు కేటాయించే అంశంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని, డిసిసి ఎన్నిక కమిటీ పరిశీలకులకు సిఫారసు చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఎన్నికల్లోను లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన మెజారిటీని అందజేసి అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.
హుజూర్నగర్కు ఎస్టిగా రిజర్వేషన్ సిఫారసు చేయాలి
హుజూర్నగర్ నియోజకవర్గంలో సుమారు 40 వేలకుపైగా లంబాడీ ఓటర్లు ఉన్నారని, 2026లో జరగబోయే డిలిమిటేషన్ కమిటీకి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఎస్టి రిజర్వ్ చేయాలని మంత్రి ఉత్తమ్ సిఫారసు చేయాలి అని డా. కృష్ణ నాయక్ విజ్ఞప్తి చేశారు.
లంబాడీలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన సమయం ఆసన్నం
హుజూర్నగర్ ప్రజల విశ్వాసంతో దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, లంబాడీల పట్ల తన చిత్తశుద్ధిని ఈసారి ప్రదర్శించే సమయం వచ్చిందని డా. భూక్య కృష్ణ నాయక్ అన్నారు.
