డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 22
గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ
గ్రామీణ కుటుంబాలు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నా ఉద్యోగావకాశాలపై అవగాహన లేకపోవడం వల్ల అవకాశాలు దొరకడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వంగా కృషి చేస్తున్నాం” అన్నారు.
250 కంపెనీలు పాల్గొననున్నాయి
ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 250 కంపెనీలు పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు. సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంయుక్త సహకారంతో ఈ మేళా నిర్వహణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 12,500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మరింత మంది క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
సౌకర్యాలపై ప్రత్యేక ఏర్పాట్లు
హుజూర్నగర్లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అక్కడ హెల్ప్డెస్కులు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాల్గొనేవారికి స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అభ్యర్థులు ఐదు కాపీల రెజ్యూమ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు.
భద్రతా, నిర్వహణ చర్యలు


జాబ్ మేళా విజయవంతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నరసింహకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఓఎస్డీ ప్రవీణ్, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ప్రజాప్రతినిధులు సరోత్తం రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్డి, పోతుల భాస్కర్, చింతల లక్ష్మీ నారాయణ రెడ్డి, చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
