నల్గొండ బ్యూరో, నవంబర్ 11 డైనమిక్ న్యూస్
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి — జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రధాన అతిథిగా హాజరై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విద్యాభివృద్ధికి ఆయన కృషి అపారమైందిః కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యాభివృద్ధికి అపారమైన సేవలు అందించారని తెలిపారు.ఆయన కాలంలోనే దేశంలో ఐఐటీ వంటి అత్యున్నత విద్యాసంస్థలు స్థాపించబడ్డాయని గుర్తు చేశారు.ఆజాద్ అరబిక్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలిగిన బహుభాషా కోవిదుడని, భారతరత్న గ్రహీత అని తెలిపారు.మౌలానా ఆజాద్ మైనారిటీల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారు.మౌలానా ఆజాద్ సౌమ్య స్వభావం, మైనారిటీల అభివృద్ధిపైన ఆయన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని కలెక్టర్ అన్నారు.జిల్లాలో విద్యా రంగాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే దిశగా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు.
అధికారులు, మైనారిటీ ప్రముఖులు పాల్గొన్నారు


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇంచార్జ్ డి.ఆర్.ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఏఓ మోతీలాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే మైనారిటీ ప్రముఖులు డాక్టర్ ఎం.ఏ.ఖాన్, సయ్యద్ హసన్, ఎం.డి.సలీం, ఎం.ఏ.రఫీ, ఉమర్ షరీఫ్, సయ్యద్ జాఫర్, బాబాజీ ఉద్దీన్, మసిఉద్దీన్, అహ్మద్ ఖలీమ్ తదితరులు హాజరయ్యారు.
