నల్గొండ బ్యూరో, నవంబర్ 15 , డైనమిక్
చేనేత కార్మికులకు తక్షణ రుణమాఫీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 20న హైదరాబాద్ నాంపల్లి చేనేత కమిషనర్ కార్యాలయం ముందుకు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపునిచ్చారు.
నర్సింగ్బట్లలో ప్రచారం – కరపత్రాల పంపిణీ
శనివారం నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామపంచాయతీ పరిధిలోని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్లా నర్సింహతో పాటు సభ్యులను కలుసుకుని ధర్నా విజయవంతం కోసం మురళీధర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
“రుణమాఫీ హామీ సంవత్సరం గడిచినా అమలు కాలేదు” – మురళీధర్ ఆవేదన
ఈ సందర్భంగా మాట్లాడుతూ మురళీధర్—
ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా అమలు కాకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.వస్త్ర నిలువలను కొనుగోలు చేయాలి – సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.చేనేత కార్మికుల సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిలువలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని,సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి టెస్కో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని మురళీధర్ కోరారు.
నేతన్న భీమా – ఆలస్యం లేకుండా అందించాలి
మరణించిన చేనేత కార్మికులకు నేతన్న భీమా అమలులో నెలల తరబడి ఆలస్యం జరుగుతుందని పేర్కొంటూ, వెంటనే కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇతర ప్రధాన డిమాండ్లు
చేనేత కార్మికులకు ₹5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి.అర్హులైన కార్మికులకు జియో ట్యాగింగ్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తూ గుర్తింపు కార్డ్లు ఇవ్వాలి.ఒకప్పుడు రేషన్ షాపుల ద్వారా ఇచ్చినట్లుగా చీరలు, దోతీలు, లుంగీలు వంటి చేనేత వస్త్రాలను ప్రభుత్వం పంపిణీ చేయాలి.కొత్తగా జీరో వడ్డీపై ₹5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
20న నాంపల్లి వద్ద భారీగా పాల్గొనాలని పిలుపు
ఈ అన్ని డిమాండ్ల సాధన కోసం 20న నాంపల్లి చేనేత కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మురళీధర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
నర్సింగ్బట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్లా నర్సింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
వరం కీర్తి సత్తయ్య, ఒలంకీర్తి కుమార్, చెరుపల్లి బిక్షమయ్య, నరసింహ, రాపోలు విజయ, కర్నాటి కర్నాటి తదితరులు పాల్గొన్నారు.
