విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన నేషనల్ సెమినార్
డైనమిక్, గుంటూరు, అక్టోబర్ 17
విద్య అనేది కేవలం జ్ఞాన సంపాదనకే పరిమితం కాకుండా, విలువల ఆధారంగా నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ. సుధాకర్ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో, ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ ఆర్థిక సౌజన్యంతో స్కూల్ ఆఫ్ లా అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎంబెడింగ్ ది సినర్జిటిక్ విజన్ ఆఫ్ ఎస్డీజీఎస్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అలైన్డ్ విత్ ఎన్ఈపీ 2020’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బీ. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే వారికి మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఆధునిక మేనేజ్మెంట్ విద్యలో భారతీయ విలువలు, సాంప్రదాయ జ్ఞానం, నైతిక దృక్పథం, సుస్థిరతలను సమన్వయ పరచాల్సిన అవసరాన్ని వివరించారు. భారతీయ జ్ఞాన వ్యవస్థల ఆధారంగా మేనేజ్మెంట్ విద్యలో కొత్త దిశను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, దీని ద్వారా విద్యార్థుల్లో నైతిక వ్యాపార దృక్పథం, సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఏ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు భారతీయ తత్వశాస్త్ర సంప్రదాయాల ప్రాధాన్యతను నైతిక నాయకత్వ అభివృద్ధితో అనుసంధానించి వివరించారు.ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం. పి. గణేష్ ఆధునిక అభివృద్ధి తత్త్వాలతో పాటు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సమన్వయం చేయడం ఎంత అవసరమో వివరించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాల శాశ్వత విలువలను నేటి గ్లోబలైజ్డ్ వ్యాపార ప్రపంచానికి అన్వయించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందకుపైగా ప్రతినిధులు హాజరై తమ పరిశోధన పత్రాలను సమర్పించగా, అనేక ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సు మేనేజ్మెంట్ విద్యార్థులకు మాత్రమే కాకుండా పరిశ్రమ నిపుణులు, యువ పరిశోధకులు, సమాజానికి కూడా మేలుచేసే విలువైన వేదికగా నిలిచింది. కార్యక్రమంలో విజ్ఞాన్ వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
