యాదాద్రి, డైనమిక్,అక్టోబర్ 23
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలు కోరితే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతా:
కవిత దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతాను. పార్టీ పెడితే అది నాకోసం కాదు, ప్రజల మేలు కోసం మాత్రమే ఉంటుంది” అని స్పష్టం చేశారు.
“రాజకీయాలు మాట్లాడాలంటే పార్టీ అవసరం లేదు”
తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ సంస్థ అయినప్పటికీ, అవసరమైతే రాజకీయాలపై తాను స్పష్టంగా మాట్లాడతానని కవిత పేర్కొన్నారు.
“రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మాట్లాడడమే ముఖ్యం” అని అన్నారు.
“ప్రజల మేలు జరిగితే పార్టీలు ఉండటం తప్పేమీ కాదు”
“ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో ప్రతి గల్లీకి ఒక పార్టీ ఉంటుంది. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదు, ప్రజలకు మేలు జరగడమే ముఖ్యం” అని కవిత వ్యాఖ్యానించారు.
‘జనం బాట’ కార్యక్రమంపై వివరాలు
తాను చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికేనని కవిత వివరించారు.
“ఈ నెల 25న నా స్వస్థలం నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభిస్తాను. నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో రెండు రోజులు గడిపి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను” అని తెలిపారు.
“ప్రతి వర్గంతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటాను”
రైతులు, యువత, మహిళలు, మేధావులు, విద్యావంతులు ఇలా అన్ని వర్గాల వారితో మాట్లాడి సమస్యలు అర్థం చేసుకుంటానని కవిత తెలిపారు.
“ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనడంపైనే నా దృష్టి ఉంటుంది” అని పేర్కొన్నారు.
“యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కృషి ఫలితం”
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషిని కవిత ప్రశంసించారు.యాదాద్రి గుడి ప్రతిష్ఠను కాపాడే విధంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా కృషి చేయాలి” అని సూచించారు.
“యాదాద్రి హోర్డింగ్లు స్వామి వారికి మాత్రమే ఉండాలి”
“తాను యాదాద్రికి వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్లు కనిపించాయి. తిరుమల మాదిరిగా యాదాద్రిలో కూడా స్వామివారి చిత్రపటాలే ఉండేలా చూడాలి” అని కవిత సూచించారు.
తదుపరి యాదాద్రి పర్యటనలో అన్ని అంశాలపై వివరంగా మాట్లాడతానని తెలిపారు.
“19ఏళ్లుగా తెలంగాణ జాగృతి ప్రజలతో”
“తెలంగాణ జాగృతి ఎన్జీవోగా 19 ఏళ్లుగా ప్రజా సేవలో కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే నేను రాజకీయాలు, సమీకరణాలపై మాట్లాడాను” అని కవిత గుర్తుచేశారు.
