నల్గొండ, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్)
“మొంథా” తుఫాను ప్రభావంతో నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి వెలుపలికి రావొద్దని, ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పడిపోవడానికి అవకాశం ఉన్న ఇండ్లలో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని కలెక్టర్ సూచించారు.వర్షాల ప్రభావంతో జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం స్థానిక సెలవు ప్రకటించారు. వర్షాలపై పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాలకు సంబంధించి అత్యవసర సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 1800-425-1442 ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
