సూర్యాపేట బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 29
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా “మోంధా” తుఫాన్ తీవ్ర ప్రభావం కొనసాగుతోంది.వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట పోలీస్ శాఖ “రెడ్ అలర్ట్” ప్రకటించింది.
పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తం
జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు —
“పోలీసు శాఖ మొత్తం అప్రమత్తంగా ఉంది. అన్ని సెలవులు రద్దు చేసి సిబ్బందిని విధుల్లోకి పిలిపించాం. ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలు, కల్వర్టుల వద్ద పికెట్లు ఏర్పాటు చేశాం” అని చెప్పారు. జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీరు ప్రవహిస్తున్న రోడ్లను, వంతెనలను దాటవద్దని హెచ్చరించారు.“వరద నీరు వంతెనలపై ప్రవహిస్తే వాహనాలతో వెళ్లడం ప్రమాదకరం” అని ఎస్పీ సూచించారు.
ప్రజలకు ముఖ్య సూచనలు
విద్యుత్ స్థంభాలు, తీగలు ముట్టుకోవద్దు, రైతులు పొలాలకు, బోర్ల వద్దకు వెళ్లవద్దు,చేపల వేటకు వెళ్లకూడదు, పశువులను మేతకు పొలాలకు తీసుకెళ్లవద్దు,పాత ఇండ్లలో ఉండరాదు, అవసరం లేకుండా ప్రయాణాలు చేయవద్దు, కోసిన పంట తడవకుండా జాగ్రత్త పడాలి,వర్ష సూచన తగ్గేవరకు కూలీలు బయట పనులు చేయకూడదు, పైఎత్తు నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆపాలి,పట్టణ కాలనీల్లో నీరు చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,పిల్లలను ఆటల కోసం బయటకు పంపవద్దు అని తెలిపారు
రైతులకు ప్రత్యేక హెచ్చరిక
వరి, పత్తి పంటలు కోసిన రైతులు వెంటనే పంటను కాపాడే చర్యలు తీసుకోవాలి.“పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భారీ నష్టాలను నివారించవచ్చు” అని ఎస్పీ సూచించారు
అత్యవసర సంప్రదింపు నంబర్లు
ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం ఎదురైనపుడు — డయల్ 100 లేదా సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్: 8712686026కు తక్షణమే ఫోన్ చేయవచ్చని ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
